Posts

అప్పటి నుంచే విశాఖ కేంద్రంగా పాలన: మంత్రి అమర్నాథ్‌

 సాక్షి, అమరావతి: వచ్చే అకడమిక్ సంవత్సరం నుంచే విశాఖ కేంద్రంగా పాలన సాగించనున్నట్లు మంత్రి గుడివాడ అమర్నాథ్‌ తెలిపారు. కేంద్రం ప్రభుత్వం ప్రకటించిన ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌లో ఏపీ మొదటి స్థానంలో ఉందన్నారు. శుక్రవారం అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. రాబోయే రోజుల్లో పరిశ్రమల్లో పెట్టబోయే పెట్టుబడులపై చర్చించామన్నారు. రాజ్యాంగంపై చంద్రబాబుకు గౌరవం, చిత్తశుద్ది లేవన్నారు.  'టీడీపీ నేతల తీరు సభకు వచ్చామా.. వెళ్లామా అనేలా ఉంది. ఈజ్‌ ఆఫ్‌ సెల్లింగ్‌లో చంద్రబాబు ఘనుడు. పరిశ్రమలను ఎలా అమ్మేశాడో గతంలో చూశాం. ఎంఎస్ఎమ్ఈల ద్వారా 2 లక్షల 11 వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పించాం. మరో లక్ష మందికి పైగా ఉద్యోగావకాశాలు కల్పిస్తాం. బీచ్ ఐటీని అభివృద్ది చేస్తాం. ఫిబ్రవరిలో ఇన్వెస్ట్ మెంట్ మీట్ నిర్వహిస్తాం. ఈ మీట్ లో మరిన్ని పెట్టుబడులు ఆకర్షిస్తాం. గతంలో కంటే మా హయాంలో పారిశ్రామిక అభివృద్ధి ఎక్కువగా జరిగింది.